అన్నామలై కొత్త ఉద్యమం... 24 గంటల్లో 14 లక్షల మంది చేరిక!

  • బీజేపీకి రాజీనామా చేసిన తమిళనాడు నేత అన్నామలై
  • 'వియ్ ది లీడర్స్' పేరుతో కొత్త రాజకీయ ఉద్యమం ప్రారంభం
  • ప్రారంభించిన 24 గంటల్లోనే 14 లక్షల మంది చేరిక
  • ఆయనకు మద్దతుగా పలువురు నేతల రాజీనామా
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై బీజేపీకి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. జూన్ 5న పార్టీ ఆయన రాజీనామాకు ఆమోదం తెలిపిందే. వెంటనే ఆయన 'వియ్ ది లీడర్స్' పేరుతో నూతన రాజకీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఉద్యమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రారంభించిన కేవలం 24 గంటల వ్యవధిలోనే సుమారు 14 లక్షల మంది ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావడం గమనార్హం.

గత కొంతకాలంగా పార్టీ రాష్ట్ర వ్యూహాల విషయంలో అధిష్ఠానంతో విభేదిస్తున్న అన్నామలై, చివరకు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కు పంపగా, ఆయన దానిని నిన్న ఆమోదించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల తనకు అమితమైన గౌరవం ఉందని, అయితే పార్టీని మరింత ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అన్నామలై తన లేఖలో పేర్కొన్నారు. 'సింగం'గా గుర్తింపు పొందిన ఆయన, 2020లో సివిల్ సర్వీసెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. రాజకీయల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే, 37 ఏళ్ల వయసులో రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు.

'వియ్ ది లీడర్స్' ఉద్యమం ద్వారా తమిళనాడులో వారసత్వ, వ్యక్తిపూజ రాజకీయాలకు స్వస్తి పలికి, సమర్థవంతమైన ప్రత్యామ్నాయాన్ని తీసుకురావడమే తన లక్ష్యమని అన్నామలై ప్రకటించారు. విద్య, ఆరోగ్యం, యువతకు నాయకత్వ అవకాశాలు కల్పించడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తామని తెలిపారు. దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాల స్ఫూర్తితో ఈ ఉద్యమాన్ని నిర్మిస్తామని వెల్లడించారు. అన్నామలైకి మద్దతుగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్‌తో సహా పలువురు కీలక నేతలు కూడా బీజేపీని వీడారు. ఈ నూతన ఉద్యమం రానున్న లోక్‌సభ ఎన్నికల నాటికి పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా ఆవిర్భవించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

K Annamalai
We The Leaders
Tamil Nadu politics
Annamalai BJP resignation
We The Leaders movement
Tamil Nadu BJP news

More Telugu News